వనస్థలిపురం రోడ్డు ప్రమాదం – యువకుడి దుర్మరణం

వనస్థలిపురం-నవభూమి ప్రతినిధి: వనస్థలిపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన చీమర్ల వంశీ (20) తన స్నేహితుడు బడే ప్రవీణ్‌తో కలిసి ఎఫ్‌జెడ్‌ బైక్‌పై బీఎన్‌రెడ్డినగర్‌కు వచ్చాడు. టిఫిన్‌ చేసి తిరుగు ప్రయాణంలో బీఎన్‌రెడ్డినగర్‌ లైఫ్‌కేర్‌ దవాఖాన సమీపంలో వెళ్తున్న డీసీఎం వాహనం డ్రైవర్‌ ఆకస్మికంగా బ్రేక్‌ వేయడంతో వారి బైక్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో వంశీ తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న ప్రవీణ్‌ గాయపడగా స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.