తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే 36 రైళ్లను రద్దు చేసింది. వరద నీరు ట్రైన్ మార్గాల్లో చేరడంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాకుండా మరో 25 రైళ్ల మార్గాలను మార్చారు. 14 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. ప్రయాణికుల సహాయం కోసం టోల్ ఫ్రీ నెంబర్లను కూడా అందుబాటులో ఉంచారు.
తెలంగాణలో కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది. వర్షాల వల్ల కొన్ని రైలు మార్గాల్లో వరద నీరు చేరడంతో ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నారు. దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (CPRO) శ్రీధర్ ఈ వివరాలను వెల్లడించారు. మొత్తం 36 రైళ్లను దక్షిణ మధ్య రైల్వే రద్దు చేసింది. ఈ రైళ్లు ప్రధానంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు నడిచేవి. రద్దైన రైళ్లలో కొన్ని ప్యాసింజర్ రైళ్లు, మరికొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు ఉన్నాయి. మరో 25 రైళ్ల మార్గాలను మార్చారు. ముఖ్యంగా వరద ప్రభావిత ప్రాంతాలైన కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల మీదుగా వెళ్లే రైళ్లను సురక్షితమైన మార్గాల ద్వారా మళ్లించారు. దీంతో ప్రయాణికులు గమ్యస్థానానికి చేరుకోవడానికి కొంత ఆలస్యం అయ్యే అవకాశం ఉంది.
మరో 14 రైళ్లను పాక్షికంగా రద్దు చేశారు. అంటే, ఈ రైళ్లు వాటి గమ్యస్థానానికి కొంత దూరం మాత్రమే ప్రయాణిస్తాయి. ఆ తర్వాత ప్రయాణం నిలిచిపోతుంది. ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాల్సి ఉంటుంది. కామారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.కొన్ని చోట్ల రైలు మార్గాలపై వరద నీరు నిలిచిపోయింది. మరికొన్ని చోట్ల పట్టాలు కొట్టుకుపోగా.. అధికారులు మరమ్మత్తుల చేపట్టారు. దీని కారణంగా పట్టాలపై నీటి ప్రవాహం ప్రమాదకరంగా మారింది. ఈ పరిస్థితిని అంచనా వేసిన రైల్వే అధికారులు ముందు జాగ్రత్త చర్యగా రైళ్లను రద్దు చేయడం, దారి మళ్లించడం వంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఇక రద్దైన ట్రైన్ వివరాల కోసం టోల్ ఫ్రీ నెంబర్లు వెల్లడించారు. కాచిగూడ - 9063318082, నిజామాబాద్ - 9703296714, కామారెడ్డి - 9281035664, సికింద్రాబాద్ - 040 277 86170 నెంబర్లకు డయల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చునని చెప్పారు.